సోమవారం, సెప్టెంబర్ 19, 2011

సుఖమూ, సంతోషమూ, ఆనందమూ


సుఖమూ, సంతోషమూ, ఆనందమూ

మన మానసిక జీవితాన్ని తరిచి చూస్తే అన్నిటికంటే మూలంగా కనిపింఛేది సుఖాన్వేషణా, దుఃఖనివర్తనా. మన మానసిక అన్వేషణ అంతటికీ గమ్యం సుఖంఏననిపిస్తుంది. కాకపోతే మనం కావాలనుకున్నవన్నీ మనకు లభించవు. వాటిని మనం సాధించలేనఫ్పుడు, మన యత్నంలో ఆటంకాలు సంభవించినప్పుడూ, మనసుకు బాధ కలుగుతుంది. ఆగ్రహమూ, నిరాశా, నిస్పృహా, ద్వేషమూ లాంటివి ఏర్పడడం సహజం. ఆట్లాంటి వ్యతిరేక భావాలని తొలగించడానికి వివిధ ప్రయత్నాలూ చేస్తాము.

ఆలోచన: ఆలోచన మానవుల్ని తక్కిన జంతుజాలాల్నించి విడతీసి, మానవ జీవితానికి ఒక విశిష్టత నేర్పరుస్తుంది. ఆలోచన అనేదే లేకపోతే మానవుడికి తననుగురించిన ఎరుక కలగదు. ఆ ఎరుక వల్లనే తన ప్రస్తుత స్థితి సుఖవంతమైనదైనిగానీ, కష్టవంతమైనదనిగానీ తెలియదు. జంతువులకు సుఖదుఃఖాలుండవని కాదు; వాటిని గురించిన ఙ్ఞానం ఉండదు. తనని గురించిన ఎరుకవల్లనే ప్రపంచానికి భిన్నంగా తనకి ఒక ఉనిక ఉన్నదని ఊహిస్తాడు. ఆ ఎరిక కలిగిననాడే మానవజాతి వినాశానికి విత్తనాలు వేసుకున్నాయంటారు యూజీ.

తాను ప్రత్యేకమైన వ్యక్తిననే భావం కలగడం వల్లనే తనను తను రక్షించుకోవాలని, తనలో ఉన్నాయనుకున్న వెలితిని పూరించుకోవాలనీ సదా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆలోచన అనే సాధనం మూలంగా తనకి ప్రస్తుతానికి అవసరం లేకపోయినా, భవిష్యత్తులొ భద్రత కోసం పాకులాడుతాడు. రాబోయే ప్రమాదాల్ని ఊహించుకుని సతతమూ తన చుట్టూ గోడలు కట్టుకుంటాడు. తోటివాళ్ళతో ముఠాకట్టుకుని ఇతరులతో పోరాటానికి దిగి, తన ఆస్తి కోసం, తన వాళ్లకోసం, తన దేశం కోసం, తన మతం కోసం, తన జాతి కోసం తాను శతృవులనుకున్న వాళ్ళని చంపడానికీ, చివరికి చంపబడడానికి కూడా సిద్ధమౌతాడు.

మన ఆలోచన వల్లనూ, మన ఙ్ఞాపకశక్తి వల్లనూ మన మనోస్థితులకు ఒక ఉనికీ, వ్యవధీ ఏర్పడుతాయి. నిన్న నన్ను ఎవడో అవమానించాడనుకోండి. దాని వల్ల నా మనసు నొచ్చుకుంటుంది. ఆ బాధని నేను పదే పదే ఙ్ఞాపకం చేసుకుని దానికి ప్రాణంపోస్తూ, దాన్ని ఒక మనస్థితిగా మార్చుకుంటాను. మనసులో దాన్ని తిరగ వేసుకున్నకొద్దీ దానికి మరింత తీవ్రత ఏర్పడుతుంది. అదే విధంగా అవతలవాడి మీద మనకున్న కసి కూడా ఎక్కువవుతుంది. ఈ విధంగా పూర్వపు ఙ్ఞాపకాన్ని నెమరు వేసుకోకపోతే, ఆ బాధ తీవ్రత క్రమేణా క్షీణించి సమసిపోతుంది.

సుఖం కూడా అలాంటిదే. ఏదో ఒక పాటని విని ఆనందించాం అనుకోండి. ఆ అనుభవాన్ని మనం ఆ క్షణంతో పోనివ్వం. దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ, దాన్ని ఇతర అనుభవాలతో జత చేసి, దాన్ని పోల్చిచూచి, దానికి విలువ కట్టి, అలాంటి అనుభవాలూ ఇంకా ఇంకా కావాలనుకుని సుఖాన్వేషణకు పూనుకుంటాం. ఆ క్షణికమైన ఆనందాన్ని సుఖమనే మనోస్థితిలోకి మార్చామన్నమాట. ఆ ఆనందం వ్యవధిని వీలైనంతగా పొడుగించడానికి ప్రయత్నిస్తాం.

అయితే దీన్లో ఒక అసంబద్ధత ఉంది: మనం నిమగ్నులమై ఉన్న ఆనందానుభూతి మనకు దాన్ని గురించిన ఎరుకలేనంతవరకే ఉంటుంది. ఆ ఎరుక కలిగిందో, అదే క్షణంలో మనకూ మన అనుభూతికీ విభాగం ఏర్పడి మనకి దాన్ని దూరం చేస్తుంది. మిగిలింది ఆ అనుభూతియొక్క ఙ్ఞాపకం మాత్రమే. ఆ స్మృతి ద్వారా మన గత ఆనందాన్ని తిరిగి తిరిగి ఊహించుకుంటూ, దాన్ని, లేదా అలాంటి మరోదాన్ని పునఃస్సృష్టించుకోవడానికి తాపత్రయ పదతాం.

మానవ దుఃఖానికి ముఖ్య కారణం "శాశ్వతంగా జీవితమంతా సుఖంగా ఉండాలి, దుఃఖం ఒక్క క్షణమైనా ఉండకూడదు," అనుకోవడమేనంటారు యూజీ.

ఏ అనుభూతిలోనైనా -- అది కోపం కానీండి, భయం కానీండి, అసూయ కానీండి, బాధ కానీండి, సుఖం కానీండి -- పూర్తిగా నిమగ్నులమై, దాని ఎరికే లేకుండా ఉంటే మనకు సమస్యలే ఉండవు. అయితే మనకు అవ్వకావాలి బువ్వాకావలి అన్నట్టు ఒకవైపు అనుభూతిలో నిమగ్నతా కావాలి, రెండో వైపు దాన్ని గురించిన ఙ్ఞానం, ఎరికా ఉండాలి. ఆ అనుభవం నాదే, నాకు దాని మూలంగా ఎంత సంతోషమో అనుకుంటూ చంకలు కొట్టుకోవాలి.

ఇందులో మరో సమస్య కూడా ఉంది: మన మనసూ, అలోచనా ఏదో అశాంతతనుంచి తప్పించుకొని ఒక గమ్యానికి చేరి ఆ గమ్యంలో స్థిరపడి విశ్రాంతంగా ఉండాలని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఆ గమ్యాన్ని ఏదో విధంగా ఒక వేళ సాధించినా, ఆ గమ్యంలో మనం విశ్రాంతిగా నిమగ్నులమై ఉండలేము. ఆ గమ్యాన్ని చేరుకున్నామని మనకి తెలియాలి. కాకపోతే అదే ఙ్ఞానం ఆ గమ్యాన్నించి మనని వేరుచేసి, మళ్ళా అదే గమ్యానికో, మరో గమ్యానికో మనని చోదిస్తూనే ఉంటుంది. మనని ఏ ఒక్కచోట నిలకడగా ఉండనివ్వదు. ఈ విధంగా మన మానసిక జీవితంలో అస్వస్థత, అశాంతి నిబిడీకృతమై ఉన్నవి. దీనికి కారణం మన మనసుకూ, ఆలోచనకూ గల స్వభావమే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి